skip to main | skip to sidebar

Friday, August 19, 2011

గురివింద రాజకీయాలే



ఎమ్మార్‌ అక్రమాల తీగ లాగితే అక్రమార్కులందరి డొంకంతా కదిలిందా.......
ఎమ్మార్‌ స్కాంలో పాపభారమంతా వైఎస్‌ జగన్‌ ఒక్కడిదేనా....?
ఇదే విషయంలో తన సఛ్చీలతను నిరూపించుకునే బాధ్యత చంద్రబాబుకు లేదా.....?
అవినీతి అంశం చుట్టూ రాష్ట్రంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.గురివింద నీతిని అనుసరించే రాజకీయనాయకులు ప్రతీ అడుగులో ప్రత్యర్థులను టార్గెట్‌ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు....తమపై వస్తున్న ఆరోపణల విషయాన్ని మాత్రం చాలా కన్వీనియెంట్‌గా కప్పిపెడుతున్నారు.అటు జగనైనా....ఇటు చంద్రబాబైనా...ఆ మాటకొస్తే ఏ పొలిటీషియన్‌ అయినా తమకు అవసరమైన వాదనను తీసుకుని ప్రజల్లో గందరగోళాన్ని పెంచి పోషిస్తున్నారు.తాజాగా సాగుతున్న ఎమ్మార్‌ వ్యవహారాన్నే చూస్తే...మన రాజకీయ నాయకుల అవకాశవాదం....ద్వందవైఖరులు కళ్లకు కడుతున్నాయి.
సొంతలాభం చూసుకోవడంలో మన రాజకీయనేతలు ఎంతలా ఆరితేరిపోయారో ఎమ్మార్‌ వ్యవహారాన్ని గమనిస్తే సులభంగా అర్థమవుతుంది.టీడీపీ జమానాలో మొదలైన ఎమ్మార్‌ భూసంతర్పణపై అప్పట్లో కాంగ్రెస్‌పార్టీ ఆరోపణలను గుమ్మరించింది.కాంగ్రెస్‌ హయాంలో ఎమ్మార్‌ రీ ఎంట్రీపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి.అయితే విచిత్రంగా ఎమ్మార్‌ సంస్థ అభివృధ్ది చేసిన విల్లాలను దక్కించుకోవడంలో టీడీపీ,కాంగ్రెస్‌ నాయకులు పోటీపడ్డారు.ఎమ్మార్‌లో విల్లాలు పొందిన పొలిటికల్‌ లీడర్లలో టీడీపీ అధినేత చంద్రబాబు,ప్రభుత్వ మాజీ సలహాదారుకెవిపి రామచంద్రరావు,పీసీసీ మాజీ ఛీఫ్‌ డి.శ్రీనివాస్‌,మాజీ మంత్రులు టి.దేవేందర్‌గౌడ్‌,కోటగిరి విద్యాధరరావు,రాంరెడ్డి దామోదర్‌రెడ్డి,ప్రస్తుత మంత్రులు జె.గీతారెడ్డి,గల్లా అరుణకుమారి,ఎమ్మెల్యేలు సుధీర్‌కుమార్‌ ఉన్నారు.వీరంతా నేరుగానో తమ బంధువుల పేర్లపైనో ఈ విల్లాలను పొందారు.ప్రభుత్వంలో టీడీపీ ఉన్నా...కాంగ్రెస్‌ ఉన్నా.....పైకి ఇరు పక్షాలు ఎన్ని ఆరోపణలు గుప్పించుకున్నా ఎమ్మార్‌ ప్రాజెక్టు మాత్రం యధావిధిగా...... సాఫీగానే ముందుకుసాగింది.ఓవైపు ఎమ్మార్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలంటూ మీడియా ముందు గంభీరంగా స్టేట్‌మెంట్లు ఇచ్చిన నాయకులు గుట్టుచప్పుడు కాకుండా విల్లాల రూపంలో తమ ఆస్తుల్ని పెంచుకున్నారు.ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు సందర్భంగా మరోసారి పొలిటికల్‌ లీడర్లు తమ టాలెంట్‌ను తాజాగా ప్రదర్శిస్తున్నారు.ఎమ్మార్‌ వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న అటు కాంగ్రెస్‌,ఇటు టీడీపీ నాయకులు చాలా చాకచక్యంగా చంద్రబాబు,కెవిపి నుంచి మొదలెట్టి మిగతా నేతల గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించడంలేదు.
హైకోర్టు ఆదేశాలతో సీబీఐ వైఎస్‌ జగన్‌ ప్రమేయంపై నిజాలను నిగ్గుతేలుస్తోంది.అయితే ఇక్కడే కొన్ని నైతికమైన ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.ఎమ్మార్‌ విషయంలో ఆరోపణల నిగ్గు తేలాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా లొల్లి చేస్తున్న కాంగ్రెస్‌,టీడీపీ నేతలు తమ పార్టీల నాయకుల ప్రమేయం గురించి మాత్రం నీళ్ళు నములుతున్నారు.తప్పు చేశాడు కాబట్టే జగన్‌ సుప్రీంకోర్టు నుంచి స్టే కు ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తున్న వీరంతా ఒకవేళ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదనే నమ్మకం ఉన్నపుడు తమపై విచారణకు స్వఛ్చందంగా ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేకపోతున్నారు. ఎమ్మార్‌ సంస్థ ప్రభుత్వంలోని పెద్దలను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా విధానపరమైన నిర్ణయాలు చేయించుకుందనే బలమైన ఆరోపణలున్నాయి.అది కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా...టీడీపీ సర్కార్‌ అయినా ఎమ్మార్‌ కత్తికి ఎదురులేకుండా వ్యవహారాలు నడిచాయన్నది తేటతెల్లం.హైకోర్టు ప్రాథమికంగా ఎమ్మార్‌లో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది.అయినప్పటికీ తమ ఆస్తుల ఖాతాలో ఎమ్మార్‌ విల్లాలను జోడించుకున్న పొలిటికల్‌ లీడర్లు తమ సఛ్చీలతను నిరూపించుకోవడానికి సిధ్దం కాకపోవడం విశేషం.అయినా మన అత్యాశ కాకపోతే అది వైఎస్ జగనైనా...చంద్రబాబు నాయుడైనా నైతిక బాధ్యత....స్వఛ్చందంగా విచారణకు సిధ్దపడడం లాంటి వ్యవహారాలు తమ ప్రత్యర్థులకు వర్తించాలంటారు తప్ప తమకు అన్వయించుకోవాలనుకోరు.అన్నీ ఆ తాను ముక్కలే అన్నట్టు పార్టీలు వేరు కావచ్చు....వారు వేసుకునే రాజకీయలెక్కలు వేరు కావచ్చు గానీ బేసిగ్గా వారంతా పొలిటికల్‌ లీడర్లు......గురివింద రాజకీయాలే వారి రీతిగా ఉంటుంది.......ఏమంటారు.

0 comments:

 

satish kamaal Copyright © 2011 | Template created by O Pregador | Powered by Blogger