జగన్ వర్గ ఎమ్మెల్యేల రాజీనామాల సంఖ్య అంతకంతకూ పెరుగుతాయా.........
కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలను ఆపడం సీఎం కిరణ్కు సాధ్యమవుతుందా......
జగన్ వర్గ ఎమ్మెల్యేల రిజైన్లను కాంగ్రెస్ లైట్గా తీసుకుంటోందా.......
రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.వైఎస్ జగన్ వర్గం జూలు విదిల్చింది.కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 29 మంది జగన్కు మధ్ధతుగా నిల్చి,తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.ఈ రిజైన్ల ఆటుపోట్ల మధ్య కిరణ్ సర్కార్ నావ ఏ విధంగా ముందుకు సాగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.జగన్ అలజడిని ఎదుర్కోవడంపై కాంగ్రెస్పార్టీలో తీవ్ర తర్జనభర్జన జరుగుతోంది........
ఎట్టకేలకు వైఎస్ జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాజీనామాల బాట పట్టారు.కాంగ్రెస్పార్టీ నుంచి గెలిచి జగన్తో జట్టు కట్టడం గురించి చాలా కాలంగా విమర్శలు వస్తున్నా.....పట్టించుకోని ఎమ్మెల్యేలు ఒక్కసారిగా యాక్షన్లోకి దిగారు.జగన్ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ దర్యాప్తు మొదలవడంతో వీరంతా అప్రమత్తమయ్యారు.అధికార దుర్వినియోగం విషయంలో వైఎస్సార్ పేరును సీబీఐ నివేదికలో పేర్కొనడాన్ని తప్పుబడుతూ మూకుమ్మడి రాజీనామాలతో ఝలక్ ఇచ్చారు.రిజైన్ అస్త్రాలను సంధించిన ఎమ్మెల్యేలు తమ సంఖ్య రెట్టింపు అవుతుందంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.అయితే సీబీఐ కేసులతోనో...భవిష్యత్ రాజకీయ అవసరాలతోనో కాంగ్రెస్పార్టీతో పూర్తి శతృత్వం విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.అదే సమయంలో జగన్వర్గ ఎమ్మెల్యేలు మాత్రం సై అంటే సై అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు.
ఒక్కసారిగా పాతికమందికి పైగా తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినా అధికార కాంగ్రెస్పార్టీ పెద్దగా ఆందోళన చెందలేదు.రిజైన్ల పర్యవసానాలపై ఆయా జిల్లాల మంత్రులతో సమావేశమైన సీఎం కిరణ్ తాజా పరిణామాలను సమీక్షించారు.ఆ తర్వాత కాంగ్రెస్పార్టీలో పీఆర్పీ విలీన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.....జగన్ వ్యవహారాన్ని తేలిగ్గా తీసిపారేశారు.
నంబర్గేమ్ కోణంలో చూస్తే జగన్ తనకు మధ్ధతుగా నిలిచే ఎమ్మెల్యేల సంఖ్యను 70కి చేరిస్తే తప్ప అధికార కాంగ్రెస్ షేక్ అయ్యే అవకాశాలు లేవు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్ బలం మరో పది మందిని మించి పెరగదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ప్రభుత్వ మనుగడ విషయంలో కాంగ్రెస్పార్టీ పూర్తి ధీమాతో ఉంది.అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడంపై మాత్రం జగన్ వర్గంలో స్పష్టత రావడంలేదు.మరో పదిరోజుల్లో వస్తున్న వైఎస్సార్ రెండవ వర్ధంతి తర్వాత మాత్రమే జగన్వర్గం తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందనేది తేలుతుంది.